యాత్రల ట్రెండ్ చేంజ్! 30 రోజుల్లో హీటెక్కనున్న తెలంగాణ రాజకీయం

by Disha Web Desk |
యాత్రల ట్రెండ్ చేంజ్! 30 రోజుల్లో హీటెక్కనున్న తెలంగాణ రాజకీయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రస్తుతం పాదయాత్రల ట్రెండ్ కొనసాగుతున్నది. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇప్పటికే వేల కిలోమీటర్లు నడిచారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లారు. అయితే ఎన్నికలు సమీపిస్తుండడంతో వారంతా ట్రెండ్ మార్చనున్నారు. పాదయాత్ర స్థానంలో బస్సు యాత్రలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ నియోజకవర్గాలను చుట్టివచ్చేలా రోడ్డు మ్యాప్ ను సిద్ధం చేస్తున్నారు. ఈ బస్సు యాత్రలు సంక్రాంతి తర్వాత స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి.

అధిష్టానం సూచనలతో..

ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్రలో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ బిజీగా ఉన్నారు. ఆరో విడత కూడా పాదయాత్రనే చేయనున్నారు. అయితే 'ముందస్తు' అనుమానాలతో ఫిబ్రవరి లోగా యాత్రను ముగించేయాలని పార్టీ అధిష్టానం సూచించినట్లు తెలిసింది. దీంతో బీజేపీ శ్రేణులు బస్సు యాత్ర కోసం కసరత్తులు ప్రారంభించాయి. అన్ని నియోజకవర్గాలను కవర్ చేసేలా ప్రణాళికను రూపొందిస్తున్నాయి.

బస్సులోనే 'ప్రజా ప్రస్థానం'

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల సైతం బస్సు యాత్రకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. గతేడాది అక్టోబర్ 20న ఆమె ప్రజా ప్రస్థాన యాత్రను మొదలుపెట్టి ఇప్పటి వరకు 3500 కిలోమీటర్లు నడిచారు. నర్సంపేటలో అధికార పార్టీ నేతలు అడ్డుకోవడంతో యాత్రకు బ్రేక్ పడింది. యాత్రకు హైకోర్టు అనుమతిచ్చినా పోలీసులు ఇవ్వలేదు. దీంతో అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ షర్మిల నిరాహార దీక్ష చేపట్టారు. పోలీసులు దీక్ష భగ్నం చేసి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మూడు వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించడంతో ఇప్పట్లో పాదయాత్ర కొనసాగడం కష్టమేనని తెలుస్తున్నది. దీంతో సంక్రాంతి తర్వాత నేరుగా బస్సు యాత్ర షురూ చేయనున్నట్లు తెలిసింది.

ఇతర పార్టీలు సైతం..

బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం బహుజన రాజ్యాధికార యాత్ర పేరిట ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆయన కూడా బస్సు యాత్ర చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. అంతేకాకుండా తెలంగాణలోనూ పోటీ చేయాలని భావిస్తున్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఇక్కడ కూడా పర్యటనలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పర్యటనలకు వారాహి అనే వాహనాన్ని సిద్ధం చేసుకున్న పవన్ కల్యాణ్ ఏపీతో పాటు తెలంగాణలోనూ యాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. పాదయాత్రలు నిలిపివేసి బస్సు యాత్రలకు శ్రీకారం చుడుతున్న పలు పార్టీలకు ఇది కలిసొస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.

Read More....

కేంద్రం నిధులు- రాష్ట్రం ప్రచారం.. పార్లమెంట్​ నివేదికలో వెల్లడి

Next Story

Most Viewed